ఆహారమంటే ఏమిటి ?

ApurupA
0
ప్రతి జీవికి ఆహారం కావాలి. ఆ ఆహారం కోసమే అనేకరకాల పవృత్తులతో వివిధ - వృత్తులు. వ్యాసంగాలు చేస్తుంటాం. ప్రతి 3 లేక 4 గంటలకు ఏదైనా ఆహారం తీసుకోకపోతే కడుపులో కలవరం బైలుదేరుటయేగాక - నీరసము, విసుగు, కోపం, తలనొప్పిలాంటి శారీరక బాహ్యలక్షణాలు కనుపిస్తుంటవి. దీనినే ఆకలి అనుకోవచ్చు. ఆకలి ప్రారంభించగానే
తగిన ఆహారం తినకపోతే శరీరం మానసికంగాను, శారీరకంగాను చెయ్యవలసిన పనులపట్ల విముఖత జెందుతుంది ఆహారాన్ని నియబద్ధంగా తీసుకొనే అలవాట్లు గలవారికీ ఆకలి వెయ్యటం సహజంగా సంభవిస్తుంది. ఆ విధంగా కాక చిరుతిళ్ళు తినేవారికి, కాఫీ తేనీరులాంటి పానీయాలు అధికంగా సేవించేవారికి అమితంగా పొగత్రాగేవారికి యింకా మరికొన్ని ఇతర కారణాల వల్ల ఆకలి అనేది కలుగదు. శరీరంలో ఆకలిని కలిగించే దాన్ని ''ఫీడింగ్‌ సెంటర్‌' అని ఆహారం భుజించిన తర్వాత ఇకచాలు అనేభావం (తృప్తి) కలిగించే దాన్ని ''పేషైటీ సెంటర్‌' అని అంటారు. ఆహారపు తృప్తికి మూలమైనది రక్తంలోని ''గ్లూకోస్‌' పదార్థం ఇది రక్తంలో తగ్గినప్పుడే ఆకలి కలుగుతుంది. ఆహారపదార్థాలు అనేక విధాలుగా ఉంటుందని, అయితే మన శరీరానికి ఉపయోగపడే ఆహారానికి 4 విధాలైన గుణధర్మాలు విధిగా ఉండవలసి ఉంది.

అందులో
1. దేహంలో వేడిని, శక్తిని కలిగించే గుణము.
2. దేహంలో తరగిపోతున్న శక్తిని పూరించగల్గి-దేహం పెరుగుదలను గావించే గుణము.
3. దేహంలోని ఏంజైములను, హార్మోనులను, హిమోగ్లోబిన్‌, మొదలగునవి తయారుజేయు గుణము.
4. దేహధర్మాలను సక్రమపరచి నిర్వర్తింపజేయు గుణము.

ఈ గుణ ధర్మాలు కలిగియున్న పదార్ధాలు మాత్రమే శరీరోపయోగకరమైన ఆహారమని తెలియవలసి ఉంటుంది. మిగిలిన ఆహారమంతా వ్యర్థ పదార్థమేగాక శరీరానికి హానికరంగా కూడా పనిచేస్తుంది.
శరీరానికి ఆహారానికి గల సంబంధాన్ని బట్టి ఆలోచించితే, మానవ శరీరం 96 శాతం నాలుగు ముఖ్య పదార్థములతో నిర్మించబడ్డదని శాస్త్రజ్ఞులు తెలియజేస్తున్నారు. అందులో 1. 65 శాతం ప్రాణవాయువు 2. 18 శాతం కర్బనం 3. 10 శాతం హైడ్రోజన్‌ 4. 3 శాతం నత్రజని.

ఈ విధంగా 96 శాతం గల నాల్గు ముఖ్య పదార్ధాలను మినహాయిస్తే మిగిలిన నాలుగు శాతంలో సున్నం, భాస్వరం, ఇనుము, సోడియం, అయోడిన్‌, క్లోరిన్‌, మెగ్నిషియం, కోబాల్డ్‌, క్రోమియం లాంటి నిరుపయోగ పదార్ధాలుంటవి. మనిషి మరణించిన తరువాత ఈ నిరుపయోగ పదార్థాలే బూడిద రూపంలో మిగులుతుంది. ఆహారం అనేది దేహంలో అంతార్భగంగా ఉండేదే ! ఈ ఆహారంపోషక ప్రదమైనప్పుడు దేహం ఆరోగ్యంగా ఉంటుంది. పోషకాహారాల్లో కార్బోహైడ్రేట్లు, ప్రొటీనులు, క్రొవ్వు, విటమిన్లు, ఖనిజలవణాలు, నార (పీచు) పదార్ధాలు, నీరు మొదలగునవి రసాయనిక సమ్మేళనాలుగా వుంటాయి. ఈ పోషకాలవల్లనే ఆరోగ్యం పరిపూర్ణంగా లభిస్తుంది. కాబట్టి ఆహారంలో ఉండే పోషక పదార్ధాలవల్ల దేహంలో గల మూలపదార్థాలు ఆధారపడి ఉంటాయి. అందువల్ల పరిపూర్ణారోగ్యం పొందాలన్నా! వ్యాధులను నిరోధించా లన్నా, నిర్మూలించాలన్నా మనం తినే ఆహారం యొక్క పోషక విలువల్ని గుర్తించి తింటూ వుండాలి. ఆ విధంగా కాక రుచిగా ఉందనో, మరెప్పుడూ లభించదనో, కృతిమ ఆహారాలు భుజిస్తూ వుంటే, (చిరుతిళ్ళు, బజారు అంగళ్ళల్లో అమ్మే వంటకాలు) శరీరమూల పదార్ధ పోషకత్వం నశించుట యేగాక పలువిధములైన అనారోగ్యాలు సంభవించే ప్రమాద మున్నది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
Accept !
To Top